ఇంద్రియ విషయాలు, పితృ శూశ్రూషా

"చాలా మంచి విషయం అడిగావు . ఆకాశము,గాలి, అగ్ని, నీళ్ళు, భూమి -- ఇవి పంచ మహా భూతాలు.    శబ్దము, స్పర్శము,రూపము,రసము,గంధము---- ఇవి మహా భూతాల గుణాలు . భూమికి పైన చెప్పిన అన్ని గుణాలు వుంటాయి . నీళ్ళకి గంధం తప్ప మిగిలిన నాలుగు గుణాలు వుంటాయి. అగ్నికి శబ్దము, స్పర్శము, రూపము వుంటాయి. గాలికి శబ్దము, స్పర్శము వుంటాయి.   ఆకాశానికి ఒక్క శబ్దము మాత్రమె వుంటుంది.   ఐదు మహా భూతాలూ ఒకదాన్ని విడిచి మరొకటి వుండలేవు .  ఒకటి గానే వుంటూ, స్థూలంగా మాత్రం ఐదు విధాలుగా వ్యక్తం అవుతూ వుంటాయి.
  ఇంద్రియాలు ఐదు- చెవి, చర్మము, కన్ను, నాలిక, ముక్కు--- . శబ్దము, స్పర్శము,రూపము,రసము,గంధము - ఈ ఐదు ఇంద్రియ విషయాలు. ఈ ఐదు  కాక ఆరోది మనస్సు, ఏడవది బుద్ధి , ఎనిమిదవది అహంకారం. సత్యము, రజస్సు , తమస్సు, ఈ మూడూ గుణాలు. పైన చెప్పిన ఈ పంచ మహా భూత ప్రపంచం  అవ్యక్తం అనే తత్వంలో ఆవిర్భావం (పుట్టడం ) తిరోభావము (నశించడం ) పొందుతూ వుంటుంది.

' ఇంద్రియాలను నిగ్రహిస్తే ఎలాంటి ఫలం కలుగుతుంది'   అన్న విషయం చెప్పడం అంటే బ్రహ్మ విద్య చెప్పడం అన్నమాట . నువ్వు ఉత్తమ బ్రాహ్మణుడివి .  నాలాంటి వాడికి ఇవన్ని తెలియడం కష్టం. అయినా అడిగావు కాబట్టి నాకు తెలిసింది చెప్తాను. ముందుగా పరమ బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణో త్తములకి   నమస్కరించి , బ్రహ్మవిద్యా విషయం చెప్తాను , విను". అని చెప్పడం మొదలు పెట్టాడు కౌశికుడు.
  baahyendriyaala  వల్ల  తెలియబడేది వ్యక్తం.  ఇంద్రియాలకు  అందక  కేవలం వూహ మీద తెలుసుకోదగినది అవ్యక్తం .శబ్దము మొదలైన విషయాల్లో ఇంద్రియాలు  చిందులు తొక్కుతూ వుంటాయి. బుద్ధిమంతుడు వాటి స్వభావం తెలుసుకుని అప్రమత్తుడై వుండాలి. వాటిని లొంగదీసుకుని వాటిని జయించిన వాడికి ఆత్మ  దృష్టి ప్రాప్తిస్తుంది.  అప్పుడు అతడు సర్వ భూతాల్లోనూ తననే చూడగలడు . అదే ఆత్మ .దర్శనం  అది సిద్దించిన వ్యక్తీ తపస్సులో ఎన్నడూ చలించడు . సకల విషయాలు వదిలి పెట్టడమే తపస్సు.  స్వర్గమైనా నరకమైనా ఇంద్రియాల నడవడిని బట్టి వుంటుంది.
ఈ శరీరం రధం అనుకుంటే , ఇంద్రియాలు గుర్రాలు.  ఆత్మా సారధి.  గుర్రాలు ఇష్టం వచ్చినట్లు పరుగెత్తకుండా ధైర్యం అనే  పట్టిన వాడు  స్వర్గం దారిన  వెళతాడు .
ఇంద్రియాలు ఎటు లాగితే అటు పరుగెడుతుంది మనస్సు. ఆ ఉద్వేగం అదుపులో వుంచకపోతే, తుఫానులో ఓడ సముద్రం లో మునిగినట్లు సర్వనాశనం అయిపోతుంది బుద్ధి.
ఈ ఐదు  ఇంద్రియాలు, మనస్సు తన  స్వాధీనం లోనికి తెచ్చుకున్న పురుషుడు సదా  ధ్యాన సమాధిమగ్నుడు అవుతాడు. అందరి మన్ననలు పొందుతాడు." అని వివరించగా

'సత్యము, రజస్సు, తమస్సు' --ఈ మూడు  గుణముల గూర్చి వివరించమని అడిగాడు కౌశికుడు .
"చెపుతాను విను", అని  వివరించ సాగాడు ధర్మవ్యాధుడు.
"సత్వ గుణం ప్రకాశవంతమైనది.  మూడింటి లోనికి ఉత్తమమైనది.  తమోగుణం నీచమైనది. పై మూడు గుణాల కలయికతో వున్నది రజోగుణం.
అసౌఖ్యమూ , సత్యం విలువ తెలియనిది, దైన్యం, మోహము , ఓర్పు లేకుండా వుండడం ----ఇవి తామస భావాలు.
రాగం, లోభం, జడత్వం, మానం --- ఇవి రాజస భావాలు.
ధైర్యం, శాంతీ ,దయా, సంతోషము , విద్య  ---ఇవి సాత్విక  భావాలు.
జ్ఞానవంతుడై తత్వం తెలుసుకుంటాడు సాత్వికుడు .  లోక విషయాలు  అసత్యమని,సమస్త వాంచలూ వదులుకుని ,మమకారం, వికారం,అహంకారం, హింసా మొదలైనవి విడిచిపెట్టి  ఉత్తమమైన మనశ్శాంతి  పొందుతాడు.   సత్వ గుణం  కలవాడు ఎవరైనా తుదకి  జన్మ నుండి మోక్షం పొందుతాడు .

ధర్మవ్యాధుడు చెప్తున్న  విషయాలు    కౌశికుడికి ఇంకా ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి ..
"   ఆత్మని అంటి పెట్టుకుని దేహంలో అగ్ని ఎలా వెలుగుతుంది ?దేహం లోని వాయువులకు ఉనికి పట్లు ఏవి?   --- అని అడిగాడు .
"ఆత్మాగ్నికి ఆశ్రమం నాభి.   నాభి నుండి శిరస్సు దిక్కు వృద్ది చెందుతుంది.
 ప్రాణమూ, ఆపానమూ, సమానమూ ,  ఉదానమూ, వ్యానమూ అని శరీరం లోని వాయువు ఐదు  రకాలు. ఈ ఐదు వాయువులు  శిరస్సుని అంటి పెట్టుకుని వుంటాయి.
ప్రాణ  వాయువు శిరస్సులో వుంటుంది. ఆపానం  గుదము, పొత్తికడుపులను  అంటిపెట్టుకుని వుంటుంది. ఉదానం కంఠం లో వుంటుంది. సమానం  బొడ్డు దగ్గర వుంటుంది. వ్యానం శరీరం అంతటా వుంటుంది.
ప్రాణమూ,  అపానమూ కలిసి  వొదలకుండా  ఆత్మాగ్నిని వెలిగిస్తూ వుంటాయి, మల మూత్ర బహిర్గాతానికి ఆపానం కారణం . ఉదానం కర్మబలయత్నకారి .   ప్రాణం--- భూతాత్మ భావం .ప్రాణమూ, ఆపానమూ, అగ్నీ -- వీటి సహాయంతో అన్న రసం ని ఆకర్షించి అన్ని దాతువులనీ( కొవ్వు, రక్తము,మాంసము,మెదడు,ఎముకలు,మూలుగు,శుక్రము )   పోషిస్తుంది సమానం. .ప్రాణమూ, అపానమూ వీటితో కూడుకుని దేహమంతటా చరిస్తున్న అగ్నే జీవాత్మ .నీటిలో తామరాకులాగా దేహంతో వుండి  కూడా అంటకుండా 
వెలుగుతున్న ఈ జీవాత్మే పరమాత్మ .............చేతనం లేని శరీరాన్ని చైతన్యవంతం చేస్తుంది ..ఇదే యోగులు కనిపెట్టిన రహస్యం..... వాయు రహస్యం తెలిసిన మునులు అభ్యాసం చేసి, జీవాత్మని శిరస్సులో  బంధించి వుంచుతారు.
కామ,క్రోదాలను అదుపులో  ఉంచుకోవడం జ్ఞానులకి సర్వదా క్షేమ కరమైన మార్గం.

పురుషుడు ఎప్పుడూ కర్మని  చేస్తూ వుండాలి. కాని, కర్మఫలం మాత్రం   విడిచి పెట్టాలి .
జీవితం  క్షణభంగురం. ఇది తెలుసుకోవాలి. ప్రపంచములో ఎవరినీ చెడ్డగా భావించకూడదు .  అందరితో స్నేహంగా వుండాలి.  ఇలా దయా స్వభావుడూ, నిత్య తపస్వీ, నిత్య తృప్తుడు, క్రోధం లేని వాడు ఐన బ్రాహ్మడు బ్రహ్మత్వం పొందుతాడు" . అని చెప్పి నువ్వు అడిగిన ద్ధర్మాలు , నాకు తెలిసిన ధర్మాలూ అన్నీ చెప్పాను. ఇంకా ఏమి కావాలి చెప్పు అని అడిగాడు ధర్మవ్యాధుడు.
"నువ్వు సర్వజ్ఞుడివి. తెలుసుకోవలసినవి అన్నీ విన్నాను. నా కళ్ళు తెరిపించావు " అన్నాడు కౌశికుడు.

" ఈ ఉత్తమ ధర్మం నాకు లభించడానికి మూల ధర్మం ఒకటి వుంది. అది నీకు చూపిస్తాను . రా ..." అని  కౌశికుడిని తన ఇంటి లోనికి తీసుకు వెళ్ళాడు .
లోపల  అందమైన నాలుగిళ్ళ భవంతి  వుంది.    ఒక గదిలో రకరకాల సువాసనలతో వుంది. గది మధ్య ఉన్నతాసనం మీద ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు సుఖాసీనులై వున్నారు. సంతృప్తి కూడిన ముఖాలతో ఆనందంగా వున్నారు.
కౌశికుడికి వారిని చూపి, లోపలికి వెళ్ళడం తోటే వారి పాదాలకి వినయంగా నమస్కరించి కుశలం అడిగాడు.
"నీలాంటి కుమారుడు వుంటే మాకు లోపమేమిటి బాబూ"   అని ఆశీర్వదించారు.  "నీ ధర్మమే  నీకు శ్రీ రామరక్ష . చిరంజీవివి అవుతావు . నీ వలన మన వంశం పవిత్రమై పోయింది. నీవు సామాన్యుడివి కావు. నిన్ను చెప్పాక పరశురాముణ్ణి చెప్పాలి. నీవు ఎవరో దేవుడివి . మనుష్య దేహం ధరించావు. నీతో పోల్చడానికి మరెవరూ లేరు ప్రపంచంలో " , అని అన్నారు ఆ తల్లిదండ్రులు ..
 వారికి    కౌశికుడిని పరిచయం చేసి , తగిన   ఆసనం ఇచ్చి సత్కరించారు ..
"వీళ్ళు నా తల్లిదండ్రులు . వీరికి సేవ చేయడం వల్లనే నాకు ఆ మాత్రం జ్ఞానం లభించింది.  లోకంలో అందరూ  దేవుళ్ళని పూజిస్తారు . నాకు మాత్రం వీళ్ళే దేవతలు . వీళ్ళకే నేను పళ్ళూ ,పూవులూ సమర్పిస్తాను. భక్ష్య భోజ్యాలు నివేదిస్తాను. భార్యా నిబిడ్డలతో  ఎప్పుడూ సేవిస్తూ వుంటాను. వేదాలు, వ్రతాలు యజ్ఞాలు, అన్నీ వీరే . తల్లి, తండ్రి ,గురువూ , అగ్ని, ఆత్మ -- ఈ ఐదుగురిని పూజించిన వాడు ధర్మాత్ముడు అని నమ్ము . ఆ ఇల్లాలు పంపించింది. ధర్మ జ్ఞానం కోసం నా  దగ్గరకు వచ్చావు.  ఆమె అనుగ్రహం వల్ల  ని ఇన్ని నీకు చెప్పాను.. కాని, నీ మీద మంచి  భావన లేదు  నాకు. చెయ్యరాని పని చేసావు . నీ తల్లిదండ్రులు  ఎంతో వృద్ధులు . నిను నమ్మిన వారిని విడిచి పెట్టావు. వేదం తప్ప ఇంకో చింత లేదు నీకు.    వారి   అనుమతి తీసుకోకుండా ఇల్లు వదిలి వచ్చేశావు. నీ కోసం వారి  గుండెలు పగిలి పోతున్నాయి .   ఏడ్చి,.ఏడ్చి వాళ్ళు   గ్రుడ్డి వాళ్ళు అయిపోయారు . ఇప్పుడైనా మించిపోయింది లేదు.   వెంటనే వెళ్ళు. వారి దు:ఖ్ఖాగ్ని చల్లార్చు . నీ వేదాలు,  పుణ్యం కోసం ప్రయాసా---ఇదంతా తల్లిదండ్రుల సేవ చెయ్యకపోతే వ్యర్ధం..నా  మాట విను. శుభం కలుగుతుంది నీకు".   

చెప్పాడు  ధర్మవ్యాధుడు.
సిగ్గుతో తల దించుకున్నాడు కౌశికుడు . "అన్నా, నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను, ఇవాళ నుండి మా అమ్మా నాన్నే నాకు దైవం . వాళ్ళ సేవలో రవ్వంత లోపం రానీయను. నిజంగా నాదే  భాగ్యం, నీ స్నేహం దొరికింది . బ్రహ్మానందంగా వుంది నాకు.    పాపము బరువు నా నెత్తిన పడకుండా నన్ను మేల్కొలిపావు .   నా పాలిటి దేవుడవు నీవు "... అని మరల ఇలా అన్నాడు. "ధర్మ మార్గం అసమానమైంది . అందరికీ అందనిది . నిన్ను శూద్రుడు అనడం పాపం. నీ   చరిత్రమే అద్భుతం . అన్నా , భూత ,భవిష్యత్ ,వర్తమానాలు నీకు తెలుసు కదా   ఇంత మహానీయుడవు. ఇలా పుట్టడానికి  గల కారణమేమిటి చెప్పమని "--- వేడుకున్నాడు . 
"నువ్వు  ఏది అడిగినా చెప్పడం నా ధర్మం.  అది నా కర్తవ్యమ్ కూడా .   పూర్వ జన్మలో నేనొక బ్రాహ్మణుడిని. పుణ్య చరితుడిని. వేదాలూ వేదాంగాలూ, క్షుణ్ణంగా చదువుకున్న వాడిని . నాకు ఒక రాజ పుత్రుడు స్నేహితుడిగా వుండేవాడు. అతడి సాంగత్యం మూలానా ధనుర్వేదం కూడా అభ్యసించాను. ఒక నాడు అతనితో కలసి వేటకి వెళ్లాను. ఎనో ఎన్నో మృగాలను వేటాడాము.    ఇంతలో పొరపాటున తుప్పల చాటున తపస్సు చేసుకుంటున్న ఒక మునీశ్వరుడి దేహం లోనికి  దూసుకు పోయింది నా బాణం .   వెంటనే  'హా'  అని పడిపోయాడతడు. చప్పున    పరుగెత్తాను.  నేల పై పొర్లుతున్నాడు అతడు.  నా ప్రాణాలు ఎగిరి పోయినట్లు ఐంది.   ఒదార్చబోయాను.   కోపం తో శపించాడు .." బ్రాహ్మడి వై  కిరాతుడిలా ప్రవర్తించావు. అందుచేత  కిరాతుడివై  పుడతావు"    అని. .
ఎరక్క తప్పు చేసాను . నన్ను క్షమించు . ఈ పాడు జన్మలో పదవేయకు నన్ను . అని కాళ్ళా వెళ్ళా పడ్డాను. జాలి కలిగింది అతడికి " నా మాట తప్పదు ఐతే, కిరాతుడివై  పుట్టినా ధర్మం తెలుస్తుంది తల్లిదండ్రులను భక్తితో సేవిస్తావు. అందుచేత పూర్వజన్మ స్మ్రుతి వుంటుంది నీకు . ఆ  తరువాతి జన్మలో   బ్రాహ్మణుడిగా పుడతావు.." అని అనుగ్రహించాడు..
నెమ్మదిగా ఆతడి దేహం నుండి బాణం తొలగించి భద్రంగా అతని ఆశ్రమం చేర్చాను. నా భాగ్యం -- అతడికి ప్రాణాపాయం రాలేదు. ఇదీ నా పూర్వ చరిత్ర. నా స్వయంకృతాపరాదం నాకు ఈ జన్మ కల్పించింది. నేనేం చెయ్యను చెప్పు " అన్నాడు ధర్మవ్యాధుడు .
"అన్నా , విచార పడకు. నిజానికి నీది నీచ జన్మ కాదు ఇలాంటి జన్మ ,ఇలాంటి చరిత్ర --ఆశ్చర్యకరమైన విషయం. మరో జన్మలో ఉత్తమ బ్రాహ్మడినవుతాను  అంటున్నావు . మరో జన్మ దాకా ఎందుకు --పుణ్య చరితుడివి ఈ జన్మ లోనే  ఉత్తమ బ్రాహ్మణుడివి . ఎందుకంటావా ? చెడ్డ నడత కలవాడు బ్రాహ్మణుడిగా పుట్టినా, ఆతడు శూద్రుడే. అంతకంటే నీచుడు అవుతాడు సత్యము ధర్మమూ , శౌచము --ఈ గుణాలు కలవాడు శూద్రుడికి ప్రుట్టినా ఉత్తమ బ్రాహ్మణుడు అవుతాడు.  ఇదే మునుల మతము కూడా. మంచి చేస్తే  మేలు, చెడు చేస్తే కీడు వస్తాయి. వాటి వల్ల  కలిగే   సుఖ దుఖ్ఖాలు  రెండింటినీ ఒక్కలాగే చూసేవాడు ఉత్తముడు.    ధర్మ కర్మలు చేసి మనోవ్యాధి నివారించుకుంటారు వాళ్ళు . సర్వమూ సాత్విక దృష్టితోనే  చూస్తారు వాళ్ళు.  మూడుడు  సదా హృదయ తాపంతో వుంటాడు .  దుఖ్ఖం వల్ల  తేజోహీనుడు అవుతాడు మనిషి.  ఆత్మహితమైన కార్యానికి పనికి రాకుండా పోతాడు. కనుక దుఖ్ఖాలకి దూరంగా వుండాలి . కర్తవ్య కర్మ చేసిన వారికి తప్పక శుభం కలుగుతుంది"   అన్నాడు కౌశికుడు.

"నిజం . నా   మనసు లో దుఖ్ఖం అన్నది లేనే లేదు . అంటా మంచి జరుగుతుంది అన్న దృడ నమ్మకం వుంది నాకు"--- అన్నాడు ధర్మవ్యాధుడు .  
ధర్మవ్యాదుడికి ప్రదక్షిణం చేసి సెలవు తీసుకున్నాడు కౌశికుడు .  నేరుగా తన తల్లిద్రండ్రుల వద్దకు వచ్చి వారిని ఎంతో   భక్తితో సేవించడం మొదలుపెట్టి,   చివరికి కృతార్ధుడు  అయ్యాడు.
"ధర్మరాజా, నీవు అడిగిన పతివ్రతా  మహత్యం , పితృ శూశ్రూషా  , తక్కువ జాతివాడు ఆచరించే ఉపాయము చెప్పాను.  ఇంకా ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే అడుగు " . అని అంతటి తో ఆనాటి  సాంగత్యం ముగించాడు మార్కండేయ మహాముని ..
కేవలం తల్లిదండ్రుల సేవ మానవుల జీవితాలలో ఎంత మేలు చేస్తుందో, ధర్మ పరులను చేస్తుందో  తెలుపడానికి,
స్త్రీ యొక్క ధర్మాలను తెలుపడానికి ఈ కధను మించిన కధ వుంటుంది అని .అనుకోను. ఐతే, అందరికీ  తెలిసిన కద మరల ఎందుకు  చెప్పడం అనిపించవచ్చు.

 నవీన యుగంలో వెర్రి  తలలు వేస్తున్న  మన నాగరికత మనల్ని ఎక్కడకు తీసుకు వెళ్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి లో వున్నాము ఆ అయోమయపు జీవితాల నుండి బయటకు రావాలి
అందుకే   రామాయణ ,మహాభారత కధలు మార్గదర్శకాలుగా చేసుకోవాలి.
రామాయణం మనం ఎలా వుండాలి అన్నది నేర్పిస్తుంది..  మనలో జరిగే మంచి చెడుల మధ్య ఘర్షణే  మహా భారత కధ    .
ప్రతి ఒక్కరూ చదివి, ఆచరించాలి.  ఆచరించిన వారికే ధర్మం విలువ తెలుస్తుంది.   సత్యం విలువ తెలుస్తుంది.
 ఎలా జీవించాలో తెలుస్తుంది.     
 
  ఇంద్రియ విషయాలు, పితృ శూశ్రూషా  



  

       




 
 


కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం